నిన్న కూడా జగన్ మాస్క్ పెట్టుకోలేదు.. స్టాలిన్ ను చూసి జగన్ నేర్చుకోవాలి: అచ్చెన్నాయుడు

  • కరోనాతో 10 వేల మంది చనిపోతే జగన్ ఏం చేస్తున్నారు?
  • అందరూ మాస్క్ పెట్టుకుంటుంటే.. జగన్ ఎందుకు పెట్టుకోవడం లేదు?
  • స్టాలిన్ కు ఉన్న బాధ్యత జగన్ కు లేదా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మరోసారి మండిపడ్డారు. కరోనా వల్ల రాష్ట్రంలో ఎంతో మంది చనిపోతున్నారని... ఇలాంటి పరిస్థితుల్లో కూడా జగన్ చేస్తున్నది ఏమీలేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు 10 వేల మంది చనిపోతే జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిన్న వ్యవసాయ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూడా జగన్ మాస్క్ పెట్టుకోలేదని... ఈ సమాజానికి ఆయన ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకున్నారని... ఒక్క జగన్ మాత్రమే పెట్టుకోలేదని దుయ్యబట్టారు.

తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు ఎందరో అక్కడి సీఎం స్టాలిన్ కు చెక్కులు అందించడానికి వెళ్తే ఆయన మాస్కులు పెట్టుకున్నారని... స్టాలిన్ మాస్కులు పెట్టుకుని ఎంతో బాధ్యతగా వ్యవహరించారని అచ్చెన్న కితాబునిచ్చారు. స్టాలిన్ కు ఉన్న బాధ్యత జగన్ కు లేదా? అని ప్రశ్నించారు. పేదల కడుపు నింపేందుకు రూ. 5కే తమ టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు పెట్టిందని... జగన్ సీఎం అయిన తర్వాత వాటిని ఎత్తేసి పేదలు పస్తులతో పడుకునేలా చేశాడని మండిపడ్డారు. వైయస్సార్ పేరు మీదైనా ఆ క్యాంటీన్లు కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో విధ్వంసం తప్ప మరేమీ లేదని విమర్శించారు.

Atchannaidu
Telugudesam
Jagan
YSRCP
Stalin

More Telugu News